4/11/2007
మన నగరాల దుఃస్థితి
4/09/2007
సత్యమేమిటి ?
ఈ మధ్యనే కొన్ని చర్చలలో కొన్ని విషయాలు, ఆలోచనలు మరియు వాదాలను విన్న పిమ్మట నాలో కొన్ని ఆలోచనలు రేకెత్తాయి, దాని ఫలస్వరూపంగానే నేను ఈ వ్యాసాన్ని వ్రాయటం జరిగింది.
సహజమైన (అందరూ వ్వవహరించే విధానము) వ్వవహారమే (అది వాస్తవానికి సరియైనది కాకపోయినా) సరియైనదన్న భావన నేడు సాధారణ విషయమైపోయింది. చెప్పాలంటే నేడు ఎన్నో విషయాలలో తప్పు-ఒప్పుల నిర్ధారణే మారిపోయింది. జనులకు ఏది సౌకర్యంగానూ మరియు అనుకూలంగా అనిపిస్తుందో దానికి ఆనుగుణంగా తప్పు-ఒప్పుల నిర్ధారణ చేయడం జరుగుతోంది. నీతిని వైయక్తీకరణ (customization) చేయడం జరుగుతోంది, అంతటా దీనిని సరియైనదిగా భావించడం జరుగుతోంది. నీతి యొక్క వైయక్తీకరణకు ఎన్నో ఉదాహరణలు మన చుట్టూ నిత్యం కనపడుతూనే ఉంటాయి.
ఉదాహరణకు కార్యక్షేత్రాన్ని తీసుకొనవచ్చును. అక్కడ మరొక సహ ఉద్యోగస్థుడి మేలుకు బదులు మన మేలు చూసుకోవడంలో తప్పులేదన్న భావన సాధారణంగా కనపడుతుంది. ఇక్కడ నేను భారీ మోసాల గురించి మాట్లాడట్లేదన్న విషయం ధ్యాసలో ఉంచుకొనగలరు, నేను ఇక్కడ కేవలం ఇతరుల భుజాలపై స్వారీ చేసి తమ హితవును సాధించుకునే మహాశయుల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఈ స్వ హిత సాధనలో ఎప్పుడైనా ఇతరులకు కూడా కొంత మేలు జరిగినా జరుగవచ్చు. కాని తప్పు-ఒప్పుల గురించి సరగ్గా వివేచించే బదులు, ఇతరులకు కూడా కొంత మంచి జరిగితే లేక చెడు జరుగక పోతే నియమాలను ఉల్లంఘించడంలో తప్పులేదన్న భావన సాధారణంగా కనపడుతుంది. కాని ఇక్కడ స్వల్ప సమయపు లాభ-నష్టాల గురించే ఆలోచన జరుగుతుంది కాని దీర్ఘకాలపు లాభ-నష్టాల గురించి వివేచన జరుగదు.
నా ధ్యాసలోకి వచ్చే మరొక ఉదాహరణ - మాంసాహార సేవనం మరియు రుచిపై సంయమన లోపం. నా ఉద్దేశ్యంలో చాలా సందర్భాలలో మాంసాహార సేవనం రుచి పై అసంయమనంతో ముడిపడియున్నది, నీతి కన్నా రుచిపై అసంయమనమే బలీయంగా ఉన్న ఎందరో శాకాహారులు చాలా సులువుగా మాంసాహారులు కాగలరు. మాంసాహారాన్ని సరియైనదిగా నిరూపించడానికి అనేక తర్కాలను కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది.
ఇలాంటివి ఎన్నో ఉదాహరణలు మనకు కనపడుతాయి. నా దృష్టిలో వీటన్నిటికి వెనుక మూల కారణం, మన సౌకర్యానికి అనుకూలంగా నీతి లేక సత్యం యొక్క నిర్ధారణను మార్చుకొనవచ్చుననే భావన. ఇది ఎలా ఉందంటే, మన వ్యవహారాలకు అనుగుణంగా నీతి లేక సత్యం యొక్క నిర్ధారణను మరల్చుకుని ఇక మనం ఏమి చేసినా సరియే అని అనుకోవడం. ఎవరైన లావుపాటి వ్యక్తి తన దేహభారం సరయైనదేనని భావించిన మాత్రాన అతడి ఇక్కట్లు తొలగిపోతాయా? అసలు మనం చేయవలసినది - నీతి లేక సత్యం యొక్క నిర్ధారణను మార్చకుండా మనను మనం నీతి లేక సత్యం యొక్క నిర్ధారణకు అనుగుణంగా మరల్చుకోవాలి.
కాని ఎక్కడైతే నీతి లేక సత్యం యొక్క విచారణ వస్తుందో అక్కడ భ్రాంతి ఉండనే ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఈ విషయాల గురించి కేవలం ఉపరితలంలోనే ఆలోచిస్తారు. ఏ విధంగానైతే చెరువులోని పైతట్టు నీరు మురికిగా కనపడుతుందో లేక అలల వలన చెరువు లోతట్టు సరిగ్గా కనపడదో, అలాగే నీతి లేక సత్యం విషయంలో ఆలోచించేటప్పుడు కేవలం ఉపరితలంలోనే ఆలోచిస్తే సహజంగానే భ్రాంతి కలుగుతుంది.
సత్యాన్ని తెలుసుకొనడానికి మన అంతరంగంలోని అడుగు దాకా మునగాల్సిన అవసరమున్నది, ఎందుకంటే సత్యం మన అంతరంగంలోనే ఉంది. కేవలం అడుగు దాకా వెళ్ళి తెలుసుకొనాలన్న ప్రయత్నం కావాలి, సత్యం దానంతట అదే వెలువడుతుంది.
4/08/2007
నిస్వార్థ జీవనం
నేను కొన్నేళ్ళ క్రితం, స్వామీ వివేకానంద ౧౮౯౨లో అమెరికాలో ప్రపంచ మతాల సమావేశంలో చేసిన ప్రసంగం చదివాను. ఆ ప్రసంగం యొక్క ప్రతి అంశం అద్భుతమైనది. కాని అందులోని ఒక అంశం మాత్రం నాకు ఎల్లప్పుడూ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. దానిని నేను ఎల్లప్పుడు స్మరిస్తూ ఉంటాను ఎందుకంటే ఒక విధంగా అది నాకు మనోస్థైర్యాన్ని ఇచ్చి సరైన మార్గాన్ని సూచిస్తూంటుంది. నిస్వార్థ కర్మ అంటే ప్రతి పనిని ఫలాపేక్ష లేకుండా చేయడం లోని సార్థకతను ఆనందానుభూతిని అది సూచిస్తూంటుంది. ఇంకా చెప్పాలంటే నిస్వార్థ జీవనం ఎలా ఉండాలో సూక్ష్మంగా సూచిస్తుంది స్వామీ వివేకానంద ప్రసంగంలోని ఆ అంశం.
స్వామీ వివేకానంద చేసిన ప్రసంగంలోని ఆ అంశం మహాభారత కథలోని ఒక అంశానికి సంబంధించినది - "మహాభారత కథలో శ్రీకృష్ణుడి శిష్యుడైన ధర్మరాజు రాజ్యము కోల్పోయి అడవులపాలైనాక ఒకరోజు ఆయన పత్ని ద్రౌపది ఆయనతో ఇంత ధర్మాత్ములైన మీకు ఇలాంటి దుస్థితి కలగడమేమిటి అని ప్రశ్నించింది. అప్పుడు ధర్మరాజు 'రాణీ ఆ హిమాలయ పర్వత శ్రేణులను చూడు, అవి ఎంత అందంగా, దివ్యంగా ఉన్నాయో; నేను వాటిని ప్రేమిస్తున్నాను. అవి నాకు ఏమీ ఇవ్వవు, కాని దివ్యంగా మరియు అందంగా ఉన్నవాటిని ప్రేమించడం నా స్వభావం, కనుక నేను వాటిని ప్రేమిస్తున్నాను. అలాగే నేను భగవంతుని కూడా ప్రేమిస్తాను. భగవంతుడే అన్ని అందాలకు మరియు దివ్యత్వానంతటికీ మూలం. ఆయనే ప్రేమకు ధ్యేయం, కనుక నా స్వభావానికి అనుగుణంగా నేను ఆయనను ప్రేమిస్తాను. నేను దేని గురించి ఆయనను ప్రార్థించను, ఆయనను ఏదీ అడగను. ఆయన నన్ను ఎక్కడైనా, ఎలాంటి పరిస్థితులలోనైనా ఉంచనీ. నేను కేవలం ప్రేమించడానికి మాత్రమే ఆయనను ప్రేమిస్తాను, నేను ప్రేమతో వ్యాపారం చేయలేను.' అని జవాబు ఇచ్చారు".
ఈ ప్రసంగాన్ని మననం చేసుకున్నప్పుడు, ఒక అద్భుతమైన ఆనందానుభూతి కలుగుతుంది. ఇది ప్రేమ, వాత్సల్యాలకు, నిష్కామ కర్మకు యథార్థమైన ఆదర్శం. దీనిలో భగవంతుని పై ప్రేమ, భక్తిని కూడా నిస్వార్థం మరియు నిష్కామంగా ఉంచడంలోని దివ్యత్వాన్ని సూచించారు. కాని మనం ఏమి చేస్తుంటాం? భగవంతుని పట్ల మన ఆరాధన తరచు సకామంగానే ఉంటుంది. ఇక మన నిత్య జీవితం విషయానికి వస్తే మన కుటుంబంలో వారి పై కాని లేక ఇతర వస్తువుల పై కాని, మనము చూపించే ప్రేమ కూడా తరచు ఆ ప్రేమకు బదులును ఆశిస్తూ చేసేది. మనం చేసే ప్రతి పనిలో ఏదో విధంగా ప్రతిఫలం ఆశించి చేసేదే, చివరకు మనం ఎవరికైనా ఉపకారం చేసినా, అక్కడ కూడా అవతలి వ్యక్తి మన ఉపకారానికి ప్రత్యుపకారం చేయాలనో లేక మనం చేసిన ఉపకారానికి మనకు కృతజ్ఞులై ఉండాలన్న కోరిక మన మనస్సులో ఏదో ఒక మూల దాగి ఉంటుంది. దాని వలన మనము ఆశించినది మనకు లభించనప్పుడు, లేదా మనము కోరుకున్నట్లు జరుగనప్పుడు, మనము దుఃఖానికి, ఆగ్రహానికి, అయిష్టానికి, ద్వేషానికి గురవుతాము. దాని వలన ప్రతికూలమైన దృక్పదం ఏర్పడుతుంది, సత్యాసత్యాలను తెలుసుకోకుండానే నిష్కర్షలకు వచ్చి ప్రతిక్రియాత్మకంగా మనం ప్రవర్తించడం మొదలుపెడుతూంటాము.
మన ప్రతి క్రియ ఆదర్శాలకు అనుగుణంగా కాక మన చుట్టు ప్రక్కల వాతావరణం లేక ఎదుటివారి ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. మన కర్మలు మన వశంలో లేక బాహ్య వాతావరణానికి వశమై ఉండడమనేది ఒక విధమైన బానిసత్వానికి సూచకం. అదే కనుక మనం ఏమి ఆశించకుండా నిస్వార్థంగా ప్రేమ, వాత్సల్యాలను మన మనస్సులో పెంపొందించుకుంటే, మనం చేసే ప్రతి క్రియని నిస్వార్థంగా ఎలాంటి బదులు ఆశించకుండా చేయగలిగనట్లైతే మన చుట్టుప్రక్కల అంతా ఆనందం నిండియున్నట్లు మనకు అనిపిస్తుంది. అప్పుడు మనం మన చుట్టు ప్రక్కల వాతావరణానికి లొంగక ఆదర్శాలకు అనుగుణంగా జీవనం సాగించగలం.
2/04/2007
మనం ఏం చేస్తున్నాం
మనలో చాలా మంది తమ నిత్య జీవితంలోని కార్యాలు, జీవితంలో జరిగే నిత్య సంఘటనలతోనే వ్యస్థత చెంది ఉన్నారు. మన నిత్య జీవితంలో లేక కార్యక్షేత్రంలో కలిగే ఒడిదుడుకులను ఎదుర్కొనటం, ఆ విషయాల గురించి ఆలోచించి వాటి గురించి పని చేయడంలోనే మనం సతమౌతూ ఉంటాము. ఇక మనలో ఇంకొందరికి మన సన్నిహిత కుటుంబం వారు మరియు స్నేహితులకు సంబంధించిన విషయాల గురించి మరియు సంఘటనల గురించి మాత్రమే పరిజ్ఞానం కలదు. మన సన్నిహితులకి సంబంధించిన ఒడిదుడుకుల గురించి కూడా మనం సతమౌతూ ఉంటాము, ఆ విషయాల ఫలితాలకు అనుగుణంగా మనకు హర్షం లేక దుఃఖం లభిస్తూ ఉంటాయి. అంతే తప్ప మన సమాజానికి సంబంధించిన విషయాలపై మనలో అతి కొద్ది మందికి మాత్రమే శ్రద్ధ ఉంటుంది. ఒకవేళ ఆ విషయాల గురించిన పరిజ్ఞానం ఉన్నా అతి కొద్ది మంది మాత్రమే ఆ దిశగా పని చేస్తున్నా, అందులోనూ అధిక శాతం వ్యక్తిగత కారణాల వల్ల ఒక్కోసారి తమ దిశను మరుస్తూ ఉంటారు. కాని ఒక్క విషయం మనం అందరం మరవకూడనిదేమిటంటే మనం నిజమైన ఆనందాన్ని కోరుకుంటే అది నిస్వార్థ సేవాకార్యాల వల్లనే లభిస్తుంది. అలాంటి నిస్వార్థ సేవ చేసేటప్పుడు తమ-తర భేదం నశించి అందరి యందు సమదృష్టి కలుగుతుంది, అది చివరకు నిత్యానందానికి మార్గంగా మారుతుంది.